వల్లభనేని వంశీని విమర్శిస్తూ.. ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ నేత!

  • పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన జోజిబాబు
  • దళితులకు రావాల్సిన టెండర్లను అడ్డుకుంటున్నారని మండిపాటు
  • పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో ప్రతి రోజూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో... ప్రశాంతంగా ఉన్న ఆ పార్టీలో అలజడి మొదలైంది. అప్పటి వరకు వైసీపీలో ఉన్న నేతలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు, వంశీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.

వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వంశీపై జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ నాశనం చేస్తున్నారని... వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Vallabhaneni Vamsi
YSRCP
Telugudesam
Gannavaram

More Telugu News